తాజాగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కారు మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల వరుకు ఈడ్చుకెళ్లింది. మృతి చెందిన వ్యక్తి, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ తండాకు చెందిన మెగావత్ వెంకటేష్ (22)గా పోలీసులు గుర్తించారు. వెంకటేష్ మియాపూర్ లో ఎల్ ఎల్ బీ చదువుతున్నాడని తెలిపారు. పని నిమిత్తం ఆదివారం బైక్పై జహీరాబాద్కు వచ్చాడు.
అదే రోజు అర్ధరాత్రి 2:00 గంటల సమయంలో మునిపల్లి మండలం లింగంపల్లి శివారులోని ఓ దాబా వద్ద వెంకటేష్ ప్రయాణిస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇంతలో గాయపడిన వ్యక్తి, రోడ్డుపై వెళ్తున్న మరో కారు కింద ఇరుక్కుపోయాడు.అది గమనించిన కారు డ్రైవర్ మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అయితే కంకోల్ టోల్ ప్లాజా వద్ద కారు కింద మృతదేహం ఇరుక్కుపోయి ఉండటాన్ని సిబ్బంది గమనించి ఆపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.