శుక్రవారం మయన్మార్, థాయిలాండ్ లలో రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 1,000 దాటిందని అధికారిక వర్గాలు నివేదించాయి. ఒక్క మయన్మార్లోనే 1,002 మంది మరణించారని మయన్మార్ సైనిక అధికారులు తెలిపారు. మరో 2,370 మంది గాయపడినట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బ్యాంకాక్లో ఒక పెద్ద భవనం కూలిపోవడంతో 10 మంది మరణించారని, 100 మంది వరకు నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ విపత్తులో మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. కాగా, పెను విలయంతో అతలాకుతలమైన మయన్మార్, థాయ్లాండ్లకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇప్పటికే భారత్ 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది.