అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే శుక్రవారం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని కోటి కుటుంబాల గణనను అతి తక్కువ సమయంలో పూర్తి చేసింది. సామాజిక సాధికారత ధ్యేయంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే రాష్ట్రం నలుమూలాల విజయవంతంగా సాగుతోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్లో 99.9%, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% శాతం సర్వే పూర్తయింది. కామారెడ్డిలో 98.5%, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలున్నవి, ఇలాంటివి మినహాయిస్తే వీటన్నింటా సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.