తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 105 చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలను పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 83 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
వీలైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచించింది.