ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఏప్రిల్ మరియు జూన్ మధ్య ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన దాదాపు 1600 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు శాతం అధికమని పేర్కొంది. రైలులో భోజనం చేయడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. మెట్రో రైల్వే చట్టం కింద 1,647 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. గతేడాది ఇదే సమయంలో 1600 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.రైలులో న్యూసెన్స్ చేసిన 610 మందికి ఏప్రిల్లోను, 518 మందికి మేలోను, 519 మందికి జూన్లోనూ జరిమానాలు విధించినట్టు డీఎంఆర్సీ తెలిపింది. మెట్రో రైలు పరిసరాల్లో మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మెట్రోల్లో రోజూ 67 లక్షల మంది ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి వాటిపై పర్యవేక్షణ కష్టమవుతుందని పేర్కొన్నారు. మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారానే తెలుసుకుంటున్నట్టు చెప్పారు.