భారీ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు.