ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికి ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.