రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఉదయం సూర్యుడు ప్రకాశిస్తే, సాయంత్రం వర్షం కురుస్తుంది. వెంటనే విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడికి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మరోవైపు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గత వారం రోజులుగా ఈ తరహా వాతావరణం కొనసాగుతోంది.

20 నిమిషాల పాటు బయటికి వెళ్తే, త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతూ అలసిపోతున్నారు. నగరాలతో పోలిస్తే గ్రామాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 36 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి పనికి రాలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంట చేతికొచ్చే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా ఫ్యాన్లు, ఏసీలు నడుస్తున్నా ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *