రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వెళ్ళాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. చిన్నారులు, వృద్ధులను బయటకు పంపకూడదు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కొన్నిచోట్ల కట్టలు తెగిపోవడంతో ప్రాణనష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహకరించాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన నేతలకు సూచించారు.