నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలకు ఎల్లో వార్నింగ్లు జారీ చేశారు. ఇక, తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా తగ్గింది. అలాగే హైదరాబాద్లో రెండు రోజుల క్రితం 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ప్రస్తుతం 21 డిగ్రీలకు పెరిగింది. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, రాత్రి హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. మరోవైపు, ఏపీలోని తిరుమలలో గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగా జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి పెరిగింది. రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారిపోయింది.