తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లరాదని ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 23న భుజంగరావు అరెస్టయ్యాడు. ఇప్పటికే ఆయన పెట్టుకున్న పలు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తొలుత మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నారు. దీంతో పోలీసులు అతడికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.