బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. ఏడాదికి కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నరు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నాడు. రవితేజకి ఇది 75వ సినిమా. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కిశోర్ తిరుమల డైరెక్షన్లో నెక్స్ట్ ప్రాజెక్టు ఉండనుందని తెలుస్తోంది. నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిశోర్ తిరుమల, రవితేజ కోసం ఓ ఫీల్ గుడ్ స్టోరీని రెడీ చేశారట. రీసెంట్గా తను చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తవడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మాస్ చిత్రాలతో ఆకట్టుకునే రవితేజ, ఇప్పుడు క్లాస్ డైరెక్టర్తో సినిమా అంటేనే అంచనాలు ఏర్పడతాయి. ఈ కాంబినేషన్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.