భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రామేశ్వరం ద్వీపాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన నిర్మాణం పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా రూ.550 కోట్లతో సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
ఈ క్రమంలో నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త పంబర్ రైల్వే వంతెన పునాది నిర్మాణాన్ని పరిశీలించామనీ, లిఫ్టింగ్ సిస్టమ్కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని మధురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ వెల్లడించారు. మండపం నుంచి రామేశ్వరం వరకు హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ 90 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు పట్టిందని తెలిపారు.