తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బుధవారం రాజధానికి వచ్చిన సీఎం మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై సీనియర్ నేతలతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. అమిత్ షాతో ఆయన సమావేశం ఉదయం 11:30 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానుంది. ఈ కీలక సమావేశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర అధికారులు కూడా హాజరుకానున్నారు. ప్రధాని, హోంమంత్రితో సీఎం రేవంత్రెడ్డి చర్చించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు, విధానాలు, రాష్ట్ర ప్రాముఖ్యత కలిగిన ఇతర అంశాలపై చర్చలు ఎజెండాలో ఉంటాయని భావిస్తున్నారు.