రాష్ట్రంలోని వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామన్నారు. దీనికి తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నామన్నారు. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు.