కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన విద్యుత్ విధానం తీసుకు వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పర్యావరణ హితంగా ఉండి, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీలో సోలార్, విండ్, బయో ఎనర్జీ విద్యుత్ కు ఉన్న అవకాశాలన్నిటిని పరిశీలించాలని అన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసేలా, అలాగే.. వ్యక్తులు, సంస్థలు ఉత్పత్తి చేసే మిగులు సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనువైనదిగా ఈ పాలసీ విధానం ఉండాలని సీఎం. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలు రాష్టానికి రప్పించే అంశంపై చర్చించారు.