డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. వాస్తవానికి గత నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్ బయట కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల భూమిపూజ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పని చేసిన ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం, సెక్రటేరియెట్ మధ్యలో ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *