తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీని ప్రకటించి, మూడు విడతల్లో రుణమాఫీ చేసింది. కానీ సాంకేతిక సమస్యలు సహా పలు కారణాల దృష్యా చాలా మందికి అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదు అని విమర్శలు వచ్చాయి. దీంతో అర్హత ఉండి పలు సమస్యల కారణంగా రుణ మాఫీ కాని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు నాయకులు ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే రుణమాఫీపై రాష్ట్ర బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఇందులో అర్హత ఉన్నా రుణమాఫీ కానీ వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతోందని వెల్లడించారు . మాఫీ కాని రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేస్తోందని, ఆధార్ తప్పుంటే బదులుగా ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాలని, రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే చేస్తామని తెలిపారు. అలాగే ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టల్లో నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు ఉంటాయని, దీని కోసం ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.