ఇక నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న నెట్ జీరో సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కి పర్యాయపదంగా ఉంటుందని సిఎం ప్రకటించారు. కాలిఫోర్నియాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు.

ఇప్పటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇక నుంచి మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం. అని సీఎం ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధరబాబు అన్నారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులను స్వయంగా హైదరాబాద్ రావాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సౌకర్యాలను పరిశీలించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *