ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ. లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేపు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయబోతోంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్లో వైరా చేరుకుంటారు.
ఇటీవలే ట్రయల్ రన్ చేపట్టిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతుల రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు. ఈ విడతలో రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తారు. మొదటి విడతలో భాగంగా జూలై 18న రూ. లక్ష వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న లక్షన్నర రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. 12 రోజుల్లో మొత్తం 17.55 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.