క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులను తమతో తీసుకెళ్లకూడదని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ తీవ్రంగా విమర్శించారు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారని, ఆ సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదని కోహ్లీ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తమతో ఉంటే ఒత్తిడిని అధిగమించి చురుగ్గా ఆడతారని ఆయన అన్నారు. ఒత్తిడిలో ఉన్న క్రీడాకారులు స్థిరంగా ఉండటానికి కుటుంబ సభ్యుల మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కోహ్లీ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ వ్యాఖ్యలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ వ్యాఖ్యలకు విస్తృత మద్దతు లభిస్తున్న నేపథ్యంలో, బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.