బెంగుళూరు: మంగళవారం బెంగుళూరు లోని కోరమంగలలో ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో 22 ఏళ్ల యువతి దారుణంగా హత్య చేయబడింది. మృతురాలు బీహార్కు చెందిన కృతి కుమారిగా గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కోరమంగళలోని వీఆర్ లేఅవుట్లో వసతి గృహంలో ఉంటోందని పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి 11.10 నుంచి 11.30 గంటల మధ్య పీజీ ఆవరణలోకి ఓ వ్యక్తి కత్తితో చొరబడ్డాడు. మూడో అంతస్తులోని ఓ గది సమీపంలో కృతిపై అతడు దాడి చేసి గొంతు కోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమాతో పాటు కోరమంగళ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గాలిస్తున్నారు. పరిచయస్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
సారా ఫాతిమా మాట్లాడుతూ, “ఒక నిందితుడు ఆమె ఉంటున్న వసతి గృహంలోకి ప్రవేశించి, ఆమె గొంతు కోసి చంపాడు, ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య వెనుక గల కారణాలపై మేము దర్యాప్తు చేస్తున్నాము, నిందితుడిని గుర్తించాము మరియు అతనిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము. ” అని చెప్పారు.
