టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న, మోసం రెట్టింపు అవుతోంది. TGNPDCL ఆన్లైన్ విద్యుత్ బిల్లు చెల్లింపు సౌకర్యాన్ని కల్పించగా, సైబర్ నేరగాళ్లు అదే ప్రయోజనాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడ్డారు. రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్ఐసీ ఏజెంట్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు కరెంటు బిల్లు పేరుతో 5 లక్షల 23 వేల రూపాయలు డ్రా చేశారు.
ఈ నెల 15న మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీకి చెందిన ఎల్ ఐసీ ఏజెంట్ వనం రఘుకు విద్యుత్ శాఖ (టీజీఎన్ పీడీసీఎల్ ) నుంచి మొబైల్ ఫోన్ కి లింక్ వచ్చింది. రఘు ఆ లింక్ ఓపెన్ చేసి ఓటీపీ పొందాడు. వెంటనే సైబర్ నేరగాడు రఘుకు ఫోన్ చేసి విద్యుత్ శాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. మీరు కరెంటు బిల్లును వెరిఫై చేస్తున్నట్లు మెసేజ్ వచ్చిన నంబర్కు మీ మొబైల్లో వచ్చిన ఓటీపిని పంపాలని మోసగాడు చెప్పాడు. వెంటనే రఘు ఓటీపి సైబర్ నేరగాళ్ల నంబర్కు పంపారు. ఆ తర్వాత రఘు ఖాతా నుంచి రూ.5,23,000/- సైబర్ నేరగాడి ఖాతాకు బదిలీ అయింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయమవడంతో మోసపోయానని గ్రహించి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.