పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. ముసాఖైల్ జిల్లాలో వాహనాలను ఆపి మరీ 23 మందిని అన్యాయంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు. పంజాబ్ (పాక్) నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పది వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటన వెనక బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నటు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బీఎల్ఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.