తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ ధరలు బాగా పడిపోయాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. చిట్యాల, గుండ్రాంపల్లిలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఈ కోళ్ల ఫారంలో రెండు లక్షల కోళ్లు ఉన్నాయని సమాచారం. వాటిలో కొన్నింటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఫామ్ లోని సుమారు 30 వేల కోళ్లను అధికారులు చంపి పాతిపెట్టారు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. కాగా నెలరోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోనే తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులకు తగిన సూచనలిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.