తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ రెడీ అయింది. ఈ నెల 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో 22వ తేదీన ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా ఇతర అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి.
అయితే, తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. 9, 96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మార్చ్ 18వ తేదీ నుంచే 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ను ఇంటర్ బోర్డు స్టార్ట్ చేసింది. అనుకున్న సమయానికే ఫలితాలు విడుదల చేసేలా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కాగా, తొలిసారిగా ర్యాండం రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు.