రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అలాగే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సోమవారం నాడు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.