తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో స్వతంత్ర సిట్ తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారణ చేపట్టగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సొలిసిటర్ తుషార్ మెహతా తమకు సిట్ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే, సిట్పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని ఆదేశించింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు వెల్లడించారు. ఈ బృందానికి సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరింది.