విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వార్డెన్కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. హాస్టల్ లో ఉంటుంది. ఇటీవల వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో విద్యార్థిని వార్డెన్ అబ్రహంకు హాయ్ అంటూ మొబైల్ ఫోన్ లో మెసేజ్ పెట్టింది. ఇద్దరూ ఫోన్లో కబుర్లు చెప్పుకున్నారు. ఈ వార్డెన్ విద్యార్థికి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో విద్యార్థిని తండ్రి బుధవారం పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వార్డెన్ కనిపించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలో వార్డెన్ను కొట్టడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేశారు. విద్యార్థి బంధువులు దాడి చేయడంతో ప్రిన్సిపాల్ వార్డెన్ను ఆఫీసు గదిలోకి లాక్కెళ్లాడు. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసిన వార్డెన్ను రక్షించేందుకు ప్రయత్నించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ను కూడా తొలగించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.