కోల్కతా హత్య ఘటనలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. మృతురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, 27 మంది మరణించారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం నిన్న రెండు గంటల పాటు వేచి చూశానని మమతా బెనర్జీ వెల్లడించారు. డాక్టర్లతో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నించానని తెలిపారు. హత్యాచార కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని మమతా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని స్పష్టం చేశారు. భేటీపై వీడియో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతితో ఫుటేజీని డాక్టర్లకు అందజేస్తామని తెలిపారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.