నేడు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్ష రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు.
“మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని అభినందించాల్సిన రోజు కూడా, మా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి ఎన్నో భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంది. రానున్న రోజుల్లో ఈ రంగం అభివృద్ధికి మరింత కృషి చేస్తాం’’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. గతేడాది చంద్రుడిపై చంద్రయాన్-3 అంతరిక్ష నౌక విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రధాని మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.