బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.
విదేశీ పర్యటనకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతినివ్వాలని విజయసాయి కోరారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. నిన్నటి వాదనల అనంతరం విచారణ నేటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణ అనంతరం జగన్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.