Revanth Reddy

స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసిస్తూ పాఠశాల విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్య దూరం కాకూడదనే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ప్రతి సంవత్సరం రెండు యూనిఫారాలు అందించే బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.

భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగానే విద్యా రంగంలో సమూల మార్పులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యా కమిషన్ ఏర్పాటు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు అన్నీ నేటి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంలో భాగంగా చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. పిల్లలు జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని చెప్పిన నెహ్రూ ఆకాంక్షల మేరకు వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *