హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న బంజారాహిల్స్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో డీజే వాడినందుకు గాను బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి కారణమైన మేయర్తో పాటు డీజే మరియు బతుకమ్మ వేడుకల నిర్వాహకుల పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బతుకమ్మ వేడుకల్లో అనుమతించిన దానికంటే ఎక్కువ డెసిబుల్ స్థాయిలో సంగీతాన్ని వినిపించారని పలు ఆరోపణలు రావడంతో మేయర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్ బీ నగర్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.అయితే రాత్రి 11.45 గంటల తర్వాత స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు ఆడుతున్న బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారని మేయర్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమార్, డీజే సౌండ్స్ మేనేజర్ గౌస్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, బాణసంచా వినియోగంపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక నుంచి ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, బాణసంచా కాల్చడంపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిషేధం విధించారు. డీజే వాడకం వల్ల తీవ్ర శబ్ధ కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.