వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం తిరుమలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు క్రిస్టియన్ అయిన జగన్ అన్యమతస్తుల మాదిరిగానే శ్రీవేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయాలని స్వామీజీలు, హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని అంటున్నారు.
జగన్ కోసం టీటీడీ డిక్లరేషన్ ఫారం కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ముందే ఆయన బస చేసిన అతిథిగృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫారం పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్టు చెపుతున్నారు. ఓవైపు ఇంత జరుగుతున్నా డిక్లరేషన్ పై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో, జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.