హైదరాబాద్ లో అక్రమ భవనాలను కూల్చివేయాలన్న నినాదంతో ‘హైడ్రా’ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు పొంగి అపార్ట్ మెంట్లలోకి నీరు చేరి సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
అందుకు ముఖ్య కారణం చెరువులను, నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేయడమేనని నాగబాబు స్పష్టం చేశారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దాం. రేవంత్ రెడ్డి గారూ మా సంపూర్ణ సహకారం మీకే” అంటూ నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు.