నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అయిన ఘనత మోదీ గారు సాధించారు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై దేశ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. సోమాజిగూడలోని జయ గార్డెన్లో జరిగిన, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డులను స్వాధీనం చేసుకుని బీజేపీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మహంకాళి జిల్లా పార్టీ అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, అట్లూరి రామకృష్ణ, ఎల్.దీపక్ రెడ్డి హాజరయ్యారు.