ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు. చివరి శుక్రవారం పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేయాలని నిర్ణయించారు. ఈరోజు పిఠాపురంలోని పురూహుతికా ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ ఏడాది ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ ఆడపడుచు కానుకగా చీరలు పంపారు.
చీరలు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం పాదగయ క్షేత్రానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటలకు కేవలం 2వేల మందికే టోకెన్లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా 6వేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ దుర్గాభవాని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించారు .