Ponnam Prabhakar Comments On BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తామని, తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని, తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధంగా జరిగిందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇందిరా సహనీ కేసులో రాష్ట్రాలు ఎంపెరికల్ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పిందని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి, కేబినెట్, శాసనసభ, గవర్నర్ ఆమోదాలతో కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పొన్నం, గతంలో బీసీల కోసం మండల కమిషన్ తీసుకురాగానే “కమండల్” అని వ్యతిరేకించిందే బీజేపీ అని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహంతో బీసీలను మోసం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ కుట్రలను గుర్తించి రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. గతంలో జనహిత అభియాన్ కేసులో EWSకు సంబంధించి 50% పరిమితిని ఎత్తేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి చాంపియన్ అని చెబుతూ, తమ ముఖ్యమంత్రి ఎస్సీ, పీసీసీ అధ్యక్షుడు బీసీ వ్యక్తులే అని గుర్తు చేశారు. తమ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Internal Links:
కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది..
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..
External Links:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బరాబర్ అమలు చేస్తాం